Tuesday, July 21, 2026

#ఈ లోకమనే యంత్రం భగవంతుని మీద ఆధారపడి ఉంది, ఆయన శక్తి ద్వారా పనిచేస్తున్నది#ప్రియమైన_సాధకులకు_book#తెలుగు lyrical ఆడియో వీడియో

 ప్రియమైన సాధకులకు .... స్వామి చేతనానంద .pdf  డౌన్లోడ్ లింక్ :

https://drive.google.com/drive/folders/1-Gmpvzzp5mbJq1el0OteUVom0s51pwvC?usp=drive_link

ఈ లోకమనే యంత్రం భగవంతుని మీద ఆధారపడి ఉంది, ఆయన శక్తి ద్వారా పనిచేస్తున్నది  

భగవచ్చింతన ఎన్నడూ మానవద్దు. నీకు ఆనందం కలిగినా, కలుగకపోయినా క్రమవిధానంలో నిత్యం ధ్యానం చేస్తూనే ఉండు. వదలకుండా, స్థిరంగా అభ్యాసం చెయ్యగలిగితే. మళ్ళీ నీవు ఆనందాన్ని అనుభవిస్తావు. వ్యాసమహర్షి ఇలా చెప్పారు: పైత్యరసంప్రకోపిస్తే చక్కెర రుచించదు. కానీ, శ్రద్ధగా ప్రతిరోజూ చక్కెర తింటూ ఉంటే,

పైత్యప్రకోపం నయమై పంచదార రుచిని నెమ్మదినెమ్మదిగా ఆస్వాదించడం.

మొదలుపెడతావు," ఇదే విధంగా 'అవిద్య' లేక అజ్ఞానం వల్ల పారమార్ధిక

సాధనలు రుచించవు. కానీ జపధ్యానాలు వదలకుండా నిత్యం ప్రేమ,

ఉత్సాహాలతో చేస్తూ ఉంటే అజ్ఞానం వల్ల కలిగిన విషాదం నశించి,  భగవత్ప్రేమ 

(భక్తి) జనిస్తుంది. కాబట్టి ఎన్నడూ ఆధ్యాత్మిక సాధనలు వదలవద్దు. మరింత

హృదయపూర్వకంగా వాటిని కొనసాగిస్తూ ఉండు. చివరకు వాటి నుండి

ఆనందాన్ని పొందుతావు.

కర్మఫలాల గురించి ఎందుకంత శ్రద్ధ చూపిస్తావు? నీ పనులను చేస్తూ

ఉండు. ఈ లోకంలో యజమాని తన ఉద్యోగస్తులకు జీతం ఇస్తూనే ఉంటాడు.

తన కోసం పనిచేస్తున్న నీకు భగవంతుడు ఏమీ ఇవ్వకుండా ఉంటాడా? నీ

ధర్మాన్ని నీవు నిర్వర్తించు. "నేనేమీ సాధించలేదు" అనీ, "నేనేమీ అభివృద్ధి

చెందలేదు" అనీ ఫిర్యాదులు చేసి ఏమి సాధిస్తావు? ఈ ఫిర్యాదులకు బదులు

శాంతంగా నీ పని నీవు చేసుకుపోతూ ఉంటే ఫలితం దానంతటదే వస్తుంది.

యోగి అయిన రామప్రసాదు ఇలా పాడాడు.

పలు తరాలుగా వ్యవసాయమ్మును నమ్మిన కర్షకు బోలు రీతి నువు

మనస్పూర్తిగా కర్మ చేయుచును మాకు నీ ప్రయత్నమ్ములను

అట్టి యత్నమే బంగరు పంటను తప్పక హెచ్చుగ నీకే ఇచ్చును

ఓర్పు అవసరం. విత్తనం నాటగానే పంట పండుతుందా? ఓరు

కలిగి ఉండు. ఎంతో శ్రమపడ్డ తర్వాత అంటే విత్తనాన్ని రక్షించి, నీరు

పెట్టి, కలుపుతీసి, చీడపీడల నుండి రక్షించి, పశువుల నుండి రక్షించడానికి

కంచె వేసి - ఇన్ని చేసిన తర్వాత మనిషి పంట కోసుకుంటాడు.  అవిద్య లేక 

అజ్ఞానం అనేది. కామక్రోధాలకు నెలవు. పతంజలి ఆ అవిద్యను ఇలా వర్ణించాడు: 

"అనిత్యాన్ని నిత్యంగానూ, అపవిత్రతను పవిత్రతగానూ, దుఃఖాన్ని సుఖంగానూ, 

అనాత్మను ఆత్మగానూ భావించడమే అజ్ఞానం" (పతంజలి యోగసూత్రాలు, 2.5).

 మరోమాటలో చెప్పాలంటే, అశాశ్వతమైన లోకాన్ని శాశ్వతమైనదిగానూ,

అపవిత్రమైన శరీరాన్ని పవిత్రమైనదిగానూ, బాధాకరమైన ఇంద్రియభోగాల్లో

సుఖమున్నట్లుగానూ, తనకు చెందని ఇతరులను భార్యాబిడ్డలను తన

సొంతవారుగానూ భావించడమే అజ్ఞానం. ఈ తప్పుడు భావనలు అజ్ఞానం

వల్ల కలుగుతాయి. ఈ అవిద్య అనాదిగా ఉన్నదే. దానికి మూలం, అంతం

ఏమిటో కనుక్కోలేము. అంటే భగవంతుని కరుణ వల్ల జ్ఞానోదయాన్ని పొందే

వరకు అవిద్య నిలిచి ఉంటుంది, నశించదు. ఈ అవిద్య మనల్ని భగవంతుని

వైపు పోనివ్వదు. కాబట్టి గీతలో కృష్ణుడు ఇలా చెప్పాడు: "నన్ను శరణువేడినవారు.

మాత్రమే ఈ మాయను దాటుతారు" (గీత: 7.14) మన కర్తవ్యమేమంటే

భగవంతుణ్ణి శరణువేడి, దైవమే లక్ష్యంగా జీవితాన్ని గడపడం.

వివేకానంద స్వామి చెప్పినది సత్యం. "భగవద్భక్తి అందరిలో అంతర్గతంగా

ఉన్నది. కామకాంచనాల ముసుగు తొలగినప్పుడు ఆ భక్తి దానంతట అదే

బయటపడుతుంది." ఆ ముసుగును తొలగించడానికి చేసే ప్రయత్నాన్నే సాధన

లేక ఆధ్యాత్మిక శిక్షణ అంటారు. ఈ ముసుగు తొలగినప్పుడు, కుండలినీ శక్తి

మేలుకుంటుంది. నీ మనస్సును అన్ని విషయాల మీదికి పోనిస్తే ఏదీ సాధ్యం

కాదు. నీకు ఇష్టమైన మార్గాన్ని గట్టిగా పట్టుకుని, దాని ద్వారా మాత్రమే

ముక్తిని, భక్తిని పొందగలవని తీర్మానించుకో, అప్పుడే నీవు జయాన్ని

పొందగలవు.

నీవు గురువును ఎన్నుకోవడానికి, పారమార్థిక సాధనలు చేపట్టడానికి నీకు

సంపూర్ణమైన స్వతంత్రం ఉంది. "ఎవరికి విశ్వాసం, ఉత్సాహం ఉంటాయో, 

ఇంద్రియాలను ఎవరు జయించారో, వారికి జ్ఞానం లభిస్తుంది. జ్ఞానాన్ని పొందిన 

తర్వాత త్వరలో పరమశాంతిని పొందుతారు" (గీత: 4.39), "శ్రద్ధలేని అజ్ఞాని ఎల్లప్పుడూ సంశయిస్తూ వినాశం చెందుతాడు. అనుమానించే వాడికి ఈ లోకంలోగానీ, పరలోకంలోగానీ, సుఖం ఉండదు" (గీత: 4.40) ఇవి భగవంతుడు చెప్పిన మాటలు.  

మానవులు సాధారణంగా చాలా స్వార్ధపరులుగా నాకు కనిపిస్తారు.

అన్నీ తమ కోసమే జరగాలని ఆశిస్తారు. కానీ శ్రమపడడానికి ఇష్టపడరు.

ముఖ్యంగా పారమార్థిక విషయాలలో ప్రతీ ఒక్కరూ తక్షణమే పరిపూర్ణత

చెందాలని కాంక్షిస్తారు. కానీ, దాని కోసం ప్రయత్నించడానికి ఎవరు సిద్ధంగా

ఉన్నారు? పూర్వజన్మల నుండి ఎన్ని చెడు సంస్కారాలు వారి మనస్సులలో

గూడుకట్టుకుని ఉన్నాయో వారు గ్రహించరు. ఆ సంస్కారాలు ఒక ముసుగులాగా

వారివారి స్వస్వరూపాన్ని దర్శించనివ్వవు. ఎంతో కష్టపడి ఈ సంస్కారాలను

తొలగించుకున్నప్పుడు మాత్రమే వారిలో జ్ఞానం లేక భక్తి వ్యక్తమవుతుంది.

మనిషి కేవలం ఒక యంత్రం. భగవంతుడు దానిని నడిపేవాడు (యంత్రి) ఎవరి ద్వారా భగవంతుడు తన పనిని నెరవేర్చుకుంటాడో, అతడు ధన్యాత్ముడు. ఈ లోకంలో

ప్రతీ ఒక్కరూ పనిచెయ్యాల్సిందే, ఎవ్వరూ దాని నుండి తప్పించుకోలేరు. కానీ,

స్వార్థ ప్రయోజనాల కోసం చేసేవాడి పని మాయాజాలం నుండి అతన్ని

తప్పించదు. మరింతగా బంధిస్తుంది. దానికి మారుగా జ్ఞాని భగవంతుని కోసం

తన బాధ్యతలను నిర్వర్తిస్తూ బంధాలను ఖండించి వేస్తాడు. 'నేను కర్తను కాదు,

భగవంతుడే కర్త' అనే జ్ఞానం బంధాలను తెంచివేస్తుంది. ఇది సత్యమైన

సిద్ధాంతం. నేను కర్తను అనే భావన కేవలం భ్రాంతి మాత్రమే. ఎందుకంటే

నేను అనేది ఎవరో గుర్తించడం దుస్సాధ్యం కాబట్టి. ఈ నేను అనేది ఏమిటో

జాగ్రత్తగా విశ్లేషించి చూసినప్పుడు అది భగవంతుడిలో లీనమైపోతుంది. శరీరం,

మనస్సు, బుద్ధి, తదితరాలతో మనం తాదాత్మ్యం చెందడం కేవలం అజ్ఞానం

వల్ల ఏర్పడే భ్రాంతి. అవి శాశ్వతంగా ఉంటాయా? వివేకంతో వాటిని భ్రాంతి

జనితాలుగా చూడటం వల్ల అవన్నీ అదృశ్యమై పోతాయి. ఎవరి నుండి ఈ

సమస్తమూ ఉత్పన్నమైందో, ఎవరిలో ఇది ఉంటున్నదో, చివరకు ఎవరిలో

లీనమై పోతుందో ఆ ఏకైక సత్యం మాత్రమే నిలిచి ఉంటుంది. ఆ సత్యం -

సచ్చిదానందం లేక పరబ్రహ్మం. 'అహం' భావానికి అది సాక్షి, అంతా

వ్యాపించివున్న భగవానుడే సృష్టి స్థితి లయ కారకుడు. అయినా వాటి చేత

అతడు స్పృశింపబడదు - నిరంజనుడు.

ఈ లోకమనే యంత్రం భగవంతుని మీద ఆధారపడి ఉంది, ఆయన

శక్తి ద్వారా పనిచేస్తున్నది. ఈ లోకం ద్వారా క్రీడ సలుపుతున్న ఆ భగవంతుడు,

తన క్రీడను చూస్తూ వినోదిస్తున్నాడు. దీనిని భగవంతుడు ఎవరికి అర్థమయ్యేలా

చేస్తాడో, అతడు మాత్రమే దీనిని తెలుసుకోగలుగుతున్నాడు. ఇతరులు దీనిని

గురించి విన్నప్పటికీ అర్థం చేసుకోలేరు. వారు వ్యామోహంలో పడి, తాము

భగవంతుని కన్నా వేరని తలుస్తూ ఉంటారు. ఇది భగవంతుని మాయ.

భగవంతునికి శరణాగతుడై మనిషి పని చేసినప్పుడు ఈ మాయ అదృశ్యమై

పోతుంది. అప్పుడు తాను నిజంగా కర్తను కాదనీ, కేవలం యంత్రాన్ని

మాత్రమేనన్న అనుభూతిని పొందుతాడు. 'కర్మలో అకర్మ' అంటే ఇదే. తానేదీ

చెయ్యడం లేదని తెలుసుకోవడం - ఇదే జీవన్ముక్తి. శరీరంలో జీవించి ఉండగానే

ముక్తి పొందడంలోని ఆనందాన్ని అనుభవించడానికే ఆత్మ మానవరూపాన్ని

దాల్చి జీవన్ముక్తుడిగా జన్మిస్తుంది. లేకపోతే 'నిత్యముక్తమైన ఆత్మ ప్రాపంచిక

సుఖాలు అనుభవించడానికే పుట్టడమనేది న్యాయసమ్మతమైన విషయం కాదు.

'శరీరం లేని స్థితిని, శరీరం ఉండగానే అనుభవించడమే మానవజీవితం యొక్క

పరమగమ్యం. ఈ స్థితిని పొంది మనిషి జీవితసాఫల్యతను పొందుతాడు.

గురుదేవుల కరుణవల్ల మనం ఆ జీవన్ముక్త స్థితిని ఈ జీవితంలోనే రుచి

చూడాలని ఆయనను ప్రార్ధిస్తున్నాను. ఇదే మనకు ఆఖరి జన్మ అగుగాక!

అంటే స్వార్థప్రయోజనాల కోసం మళ్ళీ మనం జన్మించకుండా ఉండాలి. ఆయన

కోసమే తప్ప వేరేదాని కోసం మనం జీవించకుండా ఉండాలి! ఈ నమ్మకం,

విశ్వాసం, అనుభవం మన జీవితాలలో దృఢంగా వేళ్ళూనుకోవాలి! గురుదేవులు

మన యెడల కరుణాళువై ఉండుగాక!




No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.