Monday, March 2, 2026

ఆత్మ యొక్క యిట్టి స్వభావమును మననము చేయుచుండినచో

  *స్థూల పంచభూతములు స్థూలమగు శరీరమునే బాధింపగలవు కాని మనసుకు కాదు అట్టిచో అతి సూక్ష్మమగు ఆత్మనెట్లు అయ్యవి భాధించగలవు...? || గీత -2 అ -23 ||

*ఆత్మ యొక్క యిట్టి స్వభావమును మననము చేయుచుండినచో 

జీవునకు అపరిమిత ధైర్యము చేకూరగలదు. || గీత -2 అ -22 ||

*జ్ఞానము సంపాదించి కర్మ సంచయ మొనర్చుకొని, మరల జన్మగాని,

 మరణకు గాని లేకుండ చేసుకొనుటయే సర్వోత్తమమని భగవానుడు 

మున్ముందు తెలుపుతున్నాడు.|| గీత -2 అ -25  ||

*మనస్సులయించినపుడు శేశించు వస్తువే అత్మ,

మనస్సును శుద్ధమొనప్పుట ద్వారా అద్దానిని అధిష్ఠానమందు

లయింపజేయునపుడు మిగులునదియే ఆత్మ.

ఈప్రకారముగ మనోవిలయముచే లభించు వస్తువు మనస్సున

 కెట్లు గోచరించపగలదు?

శరీరము నశించినను ఆత్మ నశింపదని చెప్పినందువలన

శరీరము కంటె వేరై ఆత్మ సాక్షిగనున్నాడని స్పష్టమగుచున్నది.

కావున మనుజుడు నశించు శరీరముతో తాదాత్మ్యము 

చెందక నహింపని ఆత్మయే తానని నిరంతరము 

భావించుచుండవలెను. దానిచే అపరిమిత

ధైర్యము, ఆనందము కలుగును. నిర్భయత్వము జనించును,

మరణ భయము పటాపంచలై పోవును. || గీత -2 అ -20  ||

*నిష్కామకర్మ, భక్తి, వైరాగ్యము, ధ్వానము, అమానిత్వాది సద్గుణములు మున్నగు సాధనముల ద్వారా హృదయమును వినిర్మల మొనర్చుకొని ఆత్మవిచారణ ద్వారా అద్దానిననుభూత మొనర్చు 

కొనవలయును (ఆత్మను). || గీత -2 అ -29 ||

*తాను దేహము కాదనియు, దేహియగు ఆత్మయే యనియు 

తలంచుట మాత్రమే యగును. దేహ భావనచే దుఃఖము,

ఆత్మ భావన చే   దుఃఖరాహిత్యము జీవులకు కలుగుచుండును.

|| గీత -2 అ -30 ||

|| గీత -2 అ -28 ||తా:- పుణ్యకార్యతత్పరులగు ఏ జనులయొక్క పాపము నశించిపోయినదో, అట్టివారు(సుఖదుఃఖాది)

రూప జ్ఞానమునుండి విడువబడినవారై దృఢవ్రతులై నన్ను సేవించుచున్నారు.

వ్యాఖ్య:- పరమాత్మను దృఢవ్రతులై సేవించినవారికే బంధవిముక్తిలభించును. కాబట్టియే అనేకులు దైవసాక్షాత్కారమునకై పెక్కు వ్రతములు, నియమములు శీలించుచుందురు. మౌనవ్రతము, ఉపవాసవ్రతము, బ్రహ్మచర్య వ్రతము, స్వాధ్యాయ వ్రతము మున్నగువానిని ఆచరించుదురు. కాని వానియందు పెక్కురికి దృఢత్వము (స్థిరత్వము) ఏర్పడుటలేదు. దానికి కారణమేమియో భగవాను డిచట స్పష్టముగ తెలిపిరి. అనేక జన్మార్జిత పాపమే దానికి కారణము. ఆ పాపము హృదయమున నున్నంతవఱకు పరమార్థసాధనలందు అడ్డుకలుగుచునేయుండును. మురికిగుడ్డకు రంగు అంటనట్లు, చవిటినేలలో విత్తనము మొలవనట్లు, పాపకల్మషయుక్తమగు హృదయమున పరమార్థబీజము లంకురింపజాలవు. అట్టివారొకవేళ వ్రతములను వానియందు దృఢత్వముకలుగదు. విరేచనమునకు ప్రారంభించినను చక్కగ కొనసాగించలేరు. మందుతీసికొనినవాడు ఇంటియందు మెదలక ఉండదలచినచో నెట్లు సాధ్యపడదో, ఆ మందు కడుపులో త్రిప్పి వానిని బయట కెట్లు సాగనంపునో, అట్లే పాపము, రజోగుణము చిత్తమునగలవాడు ధ్యాననిష్ఠయందు కూర్చొనినను, అవి వానిని లేపి బహిర్ముఖునిగా నొనర్చును. కాబట్టి భగవానుని దృఢవ్రతములతో  సేవింపవలెననిన లోనగల పాపము నశింపవలెను. అది యెట్లు నశించునో ఆ పద్ధతినిగూడ శ్రీకృష్ణపరమాత్మ ఈశ్లోకమందు విశదీకరించిరి.

పుణ్యకర్మలచేతను, అనేక సత్కార్యము లాచరించుటవలనను, నిష్కామకర్మయోగానుష్ఠానము చేతను జీవునిపాపమంతయు నశించిపోవును. కావున సాధకుడు మొట్టమొదట అనేక సత్కార్యములను, దానధర్మములు, పరోపకారము, దివ్యమంత్రజపము - మున్నగువానిని విరివిగ ఆచరించవలెను. కొందఱు శుష్కవేదాంతులు “పుణ్యకార్యములుకూడ బంధనమును కలుగజేయును, కావున వాని నాచరించరాద”ని చెప్పుదురు. అది వారియొక్క ఉన్మత్తప్రలాపమేకాని, అన్యముకాదు. ఏలయనిన భగవానుడు గీతయందు పుణ్యకార్యములను, సత్క్రియలను తప్పక చేయవలెననియే పెక్కుచోట్ల ఆదేశించిరి. ఇంతియేకాదు వానిని వదలవద్దనికూడ హెచ్చరించిరి*. భగవద్వాక్యమునందు విశ్వాసముగలవారు ఆ యాదేశమును తప్పక పాలించవలెను. పుణ్యకార్యములను జేయువానికి, శుభాచరణశీలునకు దుర్గతి యెన్నడును కలుగదనికూడ నిదివఱలో భగవానుడు చెప్పియుండుట గమనింపదగినది  కేవలము అతీతస్థితి యందుండువానికి,

ఇంద్రియమనంబులను దాటియున్నవానికి, నిశ్చల సమాధినిష్ఠునకు పుణ్యము, పాపము లేవని చెప్పిన వాక్యమును సామాన్యులగు సాధకులకు అన్వయించ రాదు. ఏలయనిన,డానిచే ఆ సాధకుని చెడగొట్టినట్లేయును. వారికి ఉభయభ్రష్టత్వము కలుగజేసినట్లేయగును. తురీయస్థితియందున్న అట్టి జీవన్ముక్తులు కూడ వ్యుత్థానదశయందు లోకాదర్శము కొఱకు పుణ్యకార్యములను, సత్క్రియలను చేయుచునేయుందురు. ఈ ప్రకారముగ పుణ్యకార్యములచే పాపము నశించినవారు సుఖదుఃఖాదిద్వందమోహరహితులై 

పరమాత్మను దృఢవ్రతములతో సేవించుందురు. దానిచే వారికి ఆత్మసాక్షాత్కారము లభించి బంధవిముక్తి సిద్ధించుచున్నది. ఈ శ్లోకముద్వారా శ్రీకృష్ణపరమాత్మ జనుల కీప్రకారముగ హెచ్చరికచేయుచున్నారు-

‘ఓ జీవులారా! మున్ముందు మీచిత్తములందుగల పాపపంకిలమును, జన్మజన్మాంతరమునందు  గావింపబడిన  దుష్కార్యములకు సంబంధించిన కల్మషబీజములను, సత్క్రియలద్వారా పుణ్యకార్యాచరణముద్వారా క్షాళనముచేయుడు. అపుడే మీకు సుఖదుఃఖాదిద్వంద్వవ్యామోహ మంతరించి దైవవ్రతమందు దృఢత్వమేర్పడును. దానిచే మోక్షము సన్నిహితమగును'. కాబట్టి సాధకులు భగవద్వాక్యమునందు విశ్వాసముగలిగి పుణ్యాచరణతత్పరులై మెలగవలెను.  

ఈశ్లోకముద్వారా మఱియొకవిషయము స్పష్టమగుచున్నది. అది యేది యనిన - పరమార్ధరంగమున సాధకుడు కొన్నిదృఢనియమములను, వ్రతములను ఏర్పఱచుకొనవలెను. లేనిచో మాయ దారి ఇవ్వదు. దుర్బలనియమములచే మాయ లొంగదు. మనస్సు స్వాధీనపడదు. రేకుగొడ్డలిచే బలమైనవృక్షము తెగదుగదా! 'ఈ రోజున ఇన్ని వేల జపముచేయనిదే భుజింపను, ఇన్ని అధ్యాయములు పారాయణము చేయనిదే మఱియొకపనిని తాకను' - ఈ ప్రకారముగ దృఢనిశ్చయములను గావించుకొనవలెను.

ఈ శ్లోకమువలన ఈ క్రిందివిషయములు స్పష్టపడుచున్నవి 

(1) మోక్షము పొందవలెననిన సాధకుడు దృఢవ్రతములను శీలింపవలెను.

(2) దృఢవ్రతము గలుగవలెననిన చిత్తమునందలి పాపము నశించవలెను.

(3) పాపము నశించవలెననిన పుణ్యకార్యములను, సత్కర్మలను లెస్సగ నాచరింపవలెను.

ప్ర:- భగవంతుని దృఢవ్రతులై ఎవరు సేవింపగలరు?

ఉ:- పాపము నశించినవారు.

ప్ర:- పాప మెట్లు నశింపగలదు?

ఉ:- పుణ్యకార్యములచే.

ప్ర:- పాపము నశించిన కలుగు ఫలితము లెవ్వి ?

ఉ:-(1) ద్వందమోహవినాశము (2) ధ్యానద్రుడత్వము.

*************************************************************************


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

ఆత్మ యొక్క యిట్టి స్వభావమును మననము చేయుచుండినచో

    *స్థూల పంచభూతములు స్థూలమగు శరీరమునే బాధింపగలవు కాని  మనసుకు కాదు అట్టిచో అతి సూక్ష్మమగు ఆత్మనెట్లు అయ్యవి భాధించగలవు...? || గీత -2 అ -2...